నేడు మహానటి సావిత్రమ్మా గారి వర్ధంతి..
@శ్రీనివాస్@
నేడు మహానటి సావిత్రమ్మా గారి వర్ధంతి..
సామాన్యజనం నుండి మేధావుల వరకు ఆమె నటనకు నీరాజనాలిచ్చిన వారే... నటనలో ఉద్దండపిండాలైన నటులకే చెమటలు పట్టించింది ఆమె... ఆమె ఎవరో కాదు మహానటి "సావిత్రి" గారు... నేడు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె స్మృతి లో కొన్ని విషయాలు..
తాను ఎవరి పక్కన హీరోయిన్గా పనిచేయడానికి భయపడిందో ఆ నాగేశ్వరరావుకే నటనలో డైలాగు డెలివరిలో పాఠాలు చెప్పే స్థాయికి చేరారు సావిత్రి గారు... నటనలో ఆమెకు ఆమే సాటి. నటనలో ఆమెతో పోటీ పడే స్థాయి తనకు కూడ లేదంటారు నాగేశ్వరరావు గారు...
ఆమె అందమైన కళ్ళు కూడా అద్భుతమైన అభినయాన్ని చూపిస్తాయి. ఆమె నవ్వు పండు వెన్నెలలను కురిపిస్తాయి. ఆమె అందమైన ముఖం చంద్రబింబాన్నేతలపిస్తుంది. నటనలో తిరుగులేని మహానటి ఆమె. ఆ నటీ శిరోమణి ఎవరో కాదు మన తెలుగు ఆడ పడుచు సావిత్రి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సావిత్రి ఒక్కరే మహానటి. ఆమె మాత్రమే ఆ బిరుదులు, కితాబులకు సరితూనే నటీమణి అని చెప్పకతప్పదు.ఆమె ఇప్పటికీ తెలుగు తెర మీద సజీవంగానే కనీపిస్తుంది. ఎన్నో పాత్రలతో అలరిస్తుంది. సావిత్రి 1936 డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్ లోని చిర్రావూరులో జన్మించారు. ఆమె తెలుగు సినీ సీమకు చాలా చిత్రంగా పరిచయం అయ్యారు. ఆమెకు చిన్ననాటి నుంచే నటన మీద మక్కువ.అలా 12 ఏళ్ళ ప్రాయం నుంచే స్టూడియోల చుట్టూ తిరిగిన ఆమెకు వయసు సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక 1950లో అంటే 14 ఏళ్ల ప్రాయంలో సంసారం మూవీలో ఆమె ఒక పాత్రకు ఎంపిక అయి కూడా వరసగా అనేక టేకులు తీసుకోవడం వల్ల వద్దనుకున్నారు.ఆమె పెద్ద నిరాశ మిగిల్చింది.ఇక 1951 పాతాళభైరవి మూవీలో ఒక చిన్న పాత్రలో కనిపించిన సావిత్రి 1952లో పెళ్ళి చేసి చూడు సినిమాతో కొంత గుర్తింపు సంపాదించుకున్నారు. 1953లో సావిత్రి నట జీవితంలో మేలి మలుపు అని చెప్పాలి. కచ్చితంగా 17 ఏళ్ల ప్రాయంలో ఆమె దేవదాసు మూవీలో పార్వతిగా అతి బరువైన పాత్ర పోషించిన సావిత్రి ఎప్పటికీ జన హృదయాలలో నిలిచిపోయేలా జీవించేశారు.సావిత్రి మాయాబజార్ లో శశి రేఖగా నటించి అందరి మెప్పూ పొందిన మహానటి. ఆ సినిమాలో మహా నటుడు ఎస్వీ రంగారావుకు ధీటుగా నటించి ఆమె మెప్పించిన తీరు అపూర్వం. అలాగే ఆమె నటించిన గుండమ్మ కధ ఒక మాస్టర్ పీస్. నర్తన శాల అపూర్వ కళాఖండం. సావిత్రి యుగం అన్నట్లుగా 50 నుంచి 60 దశకాలు సాగాయి. ఆ స్వర్ణ యుగంలో రెండు దశాబ్దాల పాటు సావిత్రి తెలుగు సినిమాను శాసించారు. ఆమె తెలుగులో పాటు హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో కూడా మూవీస్ చేశారు.ఇక ఆమెలో మంచి దర్శకురాలు ఉన్నారు. ఆమె తీసిన చిన్నారి పాపలు చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు దక్కింది. ఎన్నో బిరుదులు సొంతం చేసుకున్న సావిత్రి 1970 దశకం వచ్చేటప్పటికి క్యారక్టర్ అర్టిస్టుగా మారి అనేక సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరచారు. ఇక ఆమె చివరి రోజుల్లో అనారోగ్య కారణాలతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆమె 19 నెలల పాటు కోమాలో ఆసుపత్రిలో ఉంటూనే చివరికి అదే కోమాతో 1981 డిసెంబర్ 26న కన్ను మూశారు. ఆ మహా నటి లేని లోటుని ఎవరూ భర్తీ చేయలేరు అని నిరూపించుకున్నారు.
Comments
Post a Comment