నేడు బహుముఖ ప్రజ్ఞాశాలి "భానుమతి" గారి జయంతి..

 @శ్రీనివాస్@


నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు భానుమతి గారి జయంతి నేడు...



చిత్రపరిశ్రమలో కేవలం నటిగానే కాకుండా... నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని వంటి అన్నిరంగాల్లో రాణించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది భానుమతి రామకృష్ణ! సత్తా వుంటే ఆడవాళ్లు కూడా ఏమైనా సాధించవచ్చుననే నమ్మకాన్ని కలిగింది. తమ ప్రతిభను నిరూపించుకోవడంలో మహిళలు కూడా పురుషులకంటే ఏమాత్రం తక్కువేమీ కాదని మాటలతోనే కాదు.. చేతలతో కూడా చేసి నిరూపించిన మహిళ! తాను నటించిన ఎన్నో చిత్రాల్లో హీరోలతోపాటు సమానంగా అన్ని సన్నివేశాల్లో నటించి.. ‘‘అన్ని కళలు తెలిసిన ఓ ధీర వనిత’’గా పేరు సాధించారు.


జీవిత చరిత్ర :


1925వ సంవత్సరంలోని సెప్టెంబర్ నెలలో ప్రకాశం జిల్లా, ఒంగోలులో భానుమతి జన్మించింది. ఆమె తండ్రి పేరు బొమ్మరాజు వెంకటసుబ్బయ్య. ఆయన శాస్త్రీయ సంగీత ప్రియుడు - గొప్ కళావిశారదుడు కూడా! తన తండ్రి వద్దనుంచే భానుమతి కూడా సంగీతాన్ని అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబంలో పెరిగినప్పటికీ.. ఆమె తన 13వ ఏటలోనే 1939లో విడుదలైన ‘‘వరవిక్రయం’’ అనే సినిమాలో నటించింది. అయితే.. ఈ సినిమా నిర్మాణ సమయంలో తన కుమార్తెను తాకకూడదని ఆమె తండ్రి విధించిన షరతు నేపథ్యంలో అందుకు హీరో - నిర్మాతలు అలాగే ఒప్పుకున్నారట! ఆమె 1943 ఆగష్టు 8న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత - డైరెక్టరు - ఎడిటరు అయిన శ్రీ పి.యస్.రామకృష్ణారావును ప్రేమ వివాహమాడింది. వీరి ఏకైక సంతానం భరణి. ఈమె పేరు మీదే భరణీ స్టూడియోను నిర్మించి.. అనేక చిత్రాలను ఈ దంపతులు నిర్మించారు.


భానుమతి 50 సంవత్సరాలకుపైగా చిత్రపరిశ్రమలో వున్నప్పటికీ.. ఆమె మొత్తం 100 సినిమాల్లో మాత్రమే నటించారు. ఈమె నటించిన ముఖ్యమైన సినిమాల్లో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. ఈమె కేవలం నటిగానే కాకుండా చిత్రపరిశ్రమలోని అన్నిరంగాల్లో తన సత్తాచాటుకుని.. బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరు సంపాదించుకున్నారు. అన్ని పాత్రలు సమర్థవంతంగా నిర్వర్తించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. 2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ తుదిశ్వాస విడిచారు. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో బహుమతులతోపాటు బిరుదులు సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు.


భానుమతిని వరించిన అవార్డులు :


1. 1956 నందు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము


2. మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు , పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)


3. 1966 లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.


4. 1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది.


5. 1984 లో కలైమామణి బిరుదుతో తమిళనాడు నందలి ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.


6. బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984 ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.


7. 1984 లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.


8. 1986 లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.


9. 1986 లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.


10. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో భానుమతికి స్థానం దక్కించుకుంది.

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..